ప్రేమ మందిరం

వేదవేదాంగాలు చదివిన పండితుడు ఉండేవాడు. అతను సకల శాస్త్రాల్ని ఔపోసన పట్టాడు. ఎంతో శ్రద్ధగా ఎన్నో గ్రంథాల్ని సేకరించాడు. వాటిలోంచి విలువైనవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకున్నాడు. ఆ విలువైనవి కూడా అన్నీ కలిపితే ఒక బరువైన సంచి నిండుగా ఉండేవి. ఎక్కడికి వెళ్లినా ఆ పండితుడు వాటిని మోసుకెళ్లేవాడు. అది చాలా కష్టంగా ఉండేది కానీ ఆయన ఆ సంచిని వదిలి పెట్టేవాడు కాదు. ఎందుకంటే ఏళ్ల తరబడి శ్రమించి, సాధించిన సంపద అది. ఎంతో జ్ఞానాన్ని సంపాదించినా ఆ పండితుడికి భగవంతుణ్ణి సాక్షాత్కరించుకోవాలన్న కోరిక కోరికగానే మిగిలిపోయింది. తన జ్ఞానం తనకు ఎంతో ఆనందాన్ని వివేకాన్ని ఇస్తోంది. తన అధ్యయనం కావలసినంత పాండిత్యాన్ని ఇస్తోంది. ఎన్నో వాదోపవాదాల్లో తనని విజేతగా నిలిపింది. కానీ ఇవేవీ తనకు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని చూపడం లేదు. దైవసాక్షాత్కారానికి ఇవి ఉపయోగపడడం లేదు. దేవుణ్ణి చూడకుండా ఎంత జ్ఞానముండి ఏమి లాభం? అనుకున్నాడు.
ఆవూరి చివర ఒక గుడిసెలో ఒక సన్యాసి ఉన్నాడని దేవుడి గురించి అతనికి ఎంతో తెలుసునని, అతన్ని దర్శిస్తే సందేహాలన్నీ పటాపంచలవుతాయని ఎవరో చెప్పారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న పండితుడికి ఆ సన్యాసిని దర్శిస్తే తనకు మార్గం దొరుకుతుందని ఆశ కలిగింది. ఎప్పట్లాగా తన గ్రంథాల సంచిని నెత్తిన పెట్టుకుని చెమటలు కక్కుకుంటూ ఆ సన్యాసి గుడిసె దగ్గరకి వెళ్లాడు. సన్యాసి ఆ పండితుణ్ణి చూసి ‘ఏమిటా సంచి?’ అన్నాడు. ‘మహా గ్రంథాల సారాంశం’ అన్నాడు. పండితుడు. ‘ఎందుకంత బరువు మోస్తావు? కిందకు దించు’ అన్నాడు సన్యాసి. పండితుడు కష్టపడి కిందకు దించాడు. కానీ ఆ సంచిపై చేయిపెట్టి కూచున్నాడు. సన్యాసి ‘ఎందుకు దానిపై చేయిపెట్టడం? చేయి కూడా తీసెయ్‌…’ అన్నాడు. పండితుడు సత్యాన్వేషి గనక చేయి తేసేశాడు. సన్యాసి ‘నీకేం కావాలి?’ అన్నాడు. పండితుడు ‘నేను దైవాన్ని దర్శించా’లన్నాడు. సన్యాసి ‘నీకు ప్రేమ గురించి తెలుసా? దాని మందిరాన్ని అన్వేషించు. దాన్ని కనిపెట్టు. తరువాత నా దగ్గరకి వచ్చావంటే నీకు దైవాన్ని చూపిస్తాను. అయితే ఆ అన్వేషణలో ఈ గ్రంథాలేవీ నీకు ఉపయోగపడవు’ అన్నాడు. పండితుడు సరేనని ఆ సంచిని సన్యాసి దగ్గరే వదిలేసి వెళ్లాడు. దేన్నయినా వదులుకోవచ్చు. కానీ జ్ఞానాన్ని వదులుకోవడం కష్టం. కానీ ఆ పండితుడు దాన్ని కూడా వదిలి పెట్టి వెళ్లాడు. అతను సాహసి. సంవత్సరం గడిచినా పండితుడు రాకపోయేసరికి అతణ్ణి వెతుక్కుంటూ సన్యాసి వెళ్లాడు.
పండితుడు కనిపించాడు. ఉల్లాసంగా, ఆనందంగా ఉన్నాడు. ‘ఎందుకు నువ్వు దేవుణ్ణి తెలుసుకోడానికి మళ్లీ రాలేదు?’ అన్నాడు సన్యాసి. పండితుడు ‘స్వామీ! మన్నించండి. మీరు ప్రేమను అన్వేషించమన్నారు. నా హృదయమే ‘ప్రేమమందిరమని’ తెలుసుకున్నాను. దాంట్లోనే నేను దైవాన్ని దర్శించాను . అందుకని నేను మీ దగ్గరకు రాలేదు. నా జ్ఞానం నాకు అవసరం లేదు. ప్రేమస్వరూపులైన మనుషుల్లో దైవాన్ని చూస్తూ గడుపుతున్నాను’ అన్నాడు. సన్యాసి అతని పరివర్తనకు సంతోషించాడు.

మరణం

మరణం అనివార్యం. కానీ మనుషులు దాన్ని జీర్ణించుకోలేరు. మరణమంటే భయపడతారు. మరణమన్నది జీవితంలో భాగంగా స్వీకరించలేరు. అర్థం చేసుకోరు. మనం జన్మించింది మరణించడానికే. మరణమన్నది భూతం కాదు. జీవితంలో జరిగే ఒక సహజక్రియ. అనుబంధాలకు అంటుకున్నవాడు మరణాన్ని చూసి కంపిస్తాడు. అర్థం చేసుకున్నవాడు దాని అనివార్యతను ఆమోదిస్తాడు. పగలు వెళుతుంది. రాత్రి వస్తుంది. జీవితమయినా అంతే. పుడతాం. గిడతాం. కానీ దాన్ని మనుషులు జీర్ణించుకోలేరు. అనివార్యతని ఆమోదించడంలో ఆనందముంది. ఆహ్లాదముంది. జీవితమప్పుడే అర్థవంతమవుతుంది. ఒక సందర్భంలో మహావిష్ణువు శివుణ్ణి కలవాలని వెళ్లాడు. తన వాహనమయిన గరుత్మంతుడిపై వెళ్లాడు. మహావిష్ణువు వాహనం దిగి శివుడి నిలయానికి వెళ్లాడు. గరుత్మంతుడు వెలుపలే ఉన్నాడు. గరుత్మంతుడు ఇటూ అటూ చూశాడు ఎదరుగా ఓ పావురం. భయంతో వణికిపోతుంది. నిస్సహాయంగా నీరుగారిపోతున్నట్లనిపించింది. గరుత్మంతుడికి దాన్ని చూసి జాలేసింది. గరుత్మంతుడు దాని దగ్గరకి వెళ్లాడు. దాన్ని చూసి ”ఏమిటి? ఏమయింది? ఎందుకంతలా వణికిపోతున్నావు? ఎందుకంత భయపడిపోతున్నావు? నేను ఉన్నాను. నువ్వు భయపడాల్సిన పనిలేదు” అన్నాడు. పావురం భయం తగ్గలేదు. వణుకు తగ్గలేదు. అది గరుత్మంతుణ్ణి చూసి ”పక్షిరాజా! నువ్వు గొప్పవాడివి. మహావిష్ణువు అండదండలు నీకున్నాయి. నీకు ఎప్పుడూ ఎట్లాంటి ప్రమాదమూ, భయమూ ఉండదు. నేను సామాన్య పక్షిని. నన్నెవరు రక్షిస్తారు?” అంది.
గరుత్మంతుడు ”ఎందుకు అంతగా భయపడుతున్నావు? నేను నీకు అభయమిస్తున్నాను. నిన్ను రక్షిస్తాను. ఇంతకూ నీకు వచ్చిన ప్రమాదమేమిటి ?” అన్నాడు. పావురం ”స్వామీ! ఇంతకు ముందే మీరు రావడానికి ముందే యమధర్మరాజు శివుడి దర్శనానికి లోపలికి వెళ్ళాడు. వెళుతూ నన్ను చూసి నవ్వాడు. ” ఈరోజు మృత్యువు నిన్ను సమీపించబోతోంది” అన్నాడు. అప్పటినుంచి నాచావు తలచుకుని నేను వణికిపోతున్నాను. యముడే చెబితే ఇక నన్ను ఎవరు రక్షిస్తారు?” అంది.
గరుత్మంతుడు ”నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు. నీకు అప్పుడే మృత్యువేమిటి? నేను నిన్ను రక్షిస్తాను. ఇక్కడికి వేలమైళ్ల దూరం ఉన్న ‘లోకాలోక’ పర్వతం పైన నిన్ను వదుల్తాను. అక్కడ నీకు ప్రాణభయముండదు” అని పావురాన్ని తన రెక్కలమీద ఎక్కించుకుని వేలమైళ్ల వాయువేగ, మనోవేగాలతో వెళ్ళి కొన్ని క్షణాల్లో దాన్ని అక్కడ వదిలి తిరిగి కైలాసపర్వతం చేరాడు. కాసేపటికి శివుణ్ణి దర్శించిన యముడు బయటకి వచ్చాడు. పిట్టగోడపై పావురం లేదు. యముడు ”ఇక్కడొక పావురం ఉండాలి. ఏమైంది?” అన్నాడు.
”అది ప్రాణభయంతో ఉంటే తీసుకెళ్లి లోకాలోకపర్వతంపైన వదిలాను” అన్నాడు గరుత్మంతుడు. యమధర్మరాజు ”మంచి పని చేశావు. నేను పావురాన్ని ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. వేలమైళ్ల దూరంలో ఉన్న లోకాలోక పర్వతంలో మృత్యువు దీనికోసం ఎదురు చూస్తూంటే ఇక్కడ ఏం చేస్తోందబ్బా! అని ఆశ్చర్యపోయాను” అన్నాడు. మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు.

ఎవడు రాజు?

ఎవడు రాజు?
                                                
ఒక రాజు ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. రాజ్యాన్ని రక్షించుకునే ఆలోచనల్తో ఆశాంతిగా ఉండేవాడు. ప్రతిమనిషి అధికారం కోసం అర్రులు చాస్తాడు. అందర్నీ బానిసలు చేసుకున్నవాడు అధికారానికి బానిస అవుతాడు. అహంకారంలో అందుకున్న దానిలో స్వర్గముండదు. నరకముంటుంది. దూరం నించీ చూస్తే అది స్వర్గంలా అనిపిస్తుంది. దగ్గరికి వెళితే సింహాసనంలో ముళ్లుంటాయి. రాత్రింబవళ్లు రాజు నిరంతరం ఆందోళనలో గడిపేవాడు. తన మనసుపడే బాధల నుండి విముక్తి పొందాలని తపించేవాడు. ఈ బాధల నించి విముక్తి పొందాలంటే తను చక్రవర్తి కావాలి, అన్ని ఇతర రాజ్యాల్ని ఆక్రమించుకోవాలి. అప్పుడు తనకు ప్రశాంతత దొరుకుతుందేమో అని ఆ పనిలో పడి యుద్ధాలు చేస్తూ పోయాడు.
కాలం గడుస్తోంది. తన సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ పోతున్నాడు. దాంతోబాటు అతనికి అశాంతి, ఆందోళన పెరుగుతూ పోతున్నాయి. అతను కలలు కంటూ పోతున్నాడు. లేని భవిష్యత్తు కోసం, రాని భవిష్యత్తు కోసం ఆరాటంతో సాగిపోతున్నాడు. అధికారకాంక్ష అతన్లో అశాంతితో బాటు రోజురోజుకూ పెరుగుతూ పోతుంది. రాజు నడివయస్సు దాటాడు. బలం తగ్గింది. పెద్దవాడయ్యాడు కదా! అందుకోవలసింది మరణమొక్కటే. ఆ ఆలోచనల్తో అతన్లో మరింత గుబులు రేగింది.
మనిషి యవ్వన దశలో ఏ విత్తనాల్ని నాటుతాడో మలిదశలో ఆ పంటనే అందుకోవాలి. అధికారకాంక్ష, ఆధిపత్యం రాజు యవ్వనాన్ని ఆక్రమించుకుని ఉండేవి. ఇప్పుడు పెద్దవాడయ్యాక అవే విషఫలాల్ని అందిస్తున్నాయి. ఎక్కడో మనసు పొరల్లో దిగులు,బాధ ఏదో సాధించాలని తపన,భౌతికమయిన సంపదలతో, సామ్రాజ్యాలతో ఆ తపన మరింత ఎక్కువవుతోంది. కానీ కాంక్షల్ని వదులుకోవడానికి సిద్దంగా లేడు. ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. కానీ ఆశ అతన్ని చావనివ్వలేదు.ఒక రోజు ఎవరికీ తెలీకుండా ఏకాంతంగా నగరాన్ని వదిలి ఒంటరిగా గ్రామసీమలవేపు వెళ్ళాడు. తనతోబాటు తన ఆలోచనల్ని, ఆరాటాల్ని మోసుకెళ్లాడు. దూరంగా పచ్చికబయల్లో పిల్లంగోవి శబ్ధం వినిపిస్తే అటువేపు వెళ్లాడు. అక్కడ ఆనందంగా ఒక పశువుల కాపరి పిల్లంగోవి ఊదుతూ కనిపించాడు. పశువులు పచ్చిక మేస్తూ ప్రశాంతంగా ఉన్నాయి. రాజు అతన్ని చూసి ”నువ్వు పశువుల కాపరివి. పేదవాడివి. కానీ సామ్రాజ్యాన్ని జయించినంత సంతోషంగా పిల్లంగోవిని ఊదుతున్నావు. ఇంత ప్రశాంతంగా ఆరాటం లేకుండా ఉండడం నీకెలా వీలయింది?” అన్నాడు.
దానికి యువకుడయిన ఆ పశువుల కాపరి ”అయ్యా! నాకు రాజ్యాలు వద్దు. ఇవ్వవద్దని కూడా దేవుణ్ణి కోరుతాను. రాజ్యం లేకుండానే నేను రాజుని. కానీ రాజ్యం వస్తేమటుకు నేను రాజును కాను” అన్నాడు. రాజు ఆశ్చర్యంగా ”నీ మాటల్లో ఏదో అంతరార్థం ఉంది. కానీ నువ్వు రాజును అంటున్నావు. ఏ విధంగా నువ్వు రాజువి!”
పశువుల కాపరి ”అయ్యా! నేను రాజ్యం వల్ల, ఐశ్యర్యం వల్ల రాజుని కాను. స్వేచ్ఛతో, స్వాతంత్య్రంతో రాజునయ్యాను. నేను నేనుగా ఉన్నాను. నా కళ్లతో ఈ మనోహరమయిన ప్రకృతి ఆస్వాదించే వీలు, వెసులుబాటు నాకు ఉంది. హృదయపూర్వకంగా ప్రేమించే నిర్మలత్వం నాదగ్గరుంది. సూర్యుడు రాజుకిచ్చిన కాంతినే నాకూ యిస్తాడు. పూలు రాజుకోసం విచ్చుకున్నట్లే నాకోసం కూడా విచ్చకుంటాయి. వాటిని చూసి ఆనందించిన నా కళ్లు మనసు నాకున్నాయి. కానీ రాజుకు అహంకారంతో వీటిని ఆస్వాదించే సమయముండదు. కారణం అతను రాజ్యకాంక్షలో అన్నీ కోల్పోతాడు. అందువల్ల రాజుకంటే నేనే గొప్పవాణ్ణి” అన్నాడు. పశువుల కాపరి మాటల్తో రాజు అహంకారం అదృశ్యమైంది.

సూర్దాస్ - పాటలతో కృష్ణుని పూజించిన భక్తుడు!

ఒకప్పుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే తపోనిష్ట ఉండాలనీ, కఠినమైన నిబంధనలను పాటించాలనీ, ఉన్నతకులంలో పుట్టి ఉండాలనీ... రకరకాల అపోహలు ఉండేవి. కానీ ఆ అపోహలను పటాపంచలు చేసి భగవంతుడు అందరివాడన్న సూక్ష్మాన్ని చాటిచెప్పిన ఉద్యమం భక్తి ఉద్యమం. ఆట, పాట, స్మరణ, సంగీతం... ఇలా మనసుకి తోచిన ఏ మార్గంలోనైనా భగవంతుని చేరుకోవచ్చునని ఈ ఉద్యమంతో తేలిపోయింది. ఆ భక్తి ఉద్యమంలో ఓ అరుదైన పాత్ర స్వామి సూర్దాస్!
సూర్దాస్ వ్యక్తిగత వివరాలు చాలా అస్పష్టంగా ఉన్నాయి. కానీ ఆయన 15వ శతాబ్దంలో జన్మించారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సూర్దాస్ పుట్టుకతోనే గుడ్డివాడని కొన్ని కథలు పేర్కొంటున్నాయి. పుట్టుగుడ్డివాడైన సూర్దాసుని కుటుంబసభ్యులు సైతం ఈసడించుకునేవారట. దాంతో దృష్టికీ, బంధాలకీ అతీతమైన ఆ పరమాత్మ మీద తన మనసుని లగ్నం చేసుకున్నాడు సూర్దాస్. ఒకరోజు తన ఊరిమీదుగా తీర్థయాత్రలకు వెళ్తున్న భక్తుల కీర్తనలు ఆయన చెవిన పడ్డాయి. అలాంటి కీర్తనలలోనే తన మనసుకి సాంత్వన లభిస్తుందని ఆయనకు తోచింది. అంతే! ఇల్లు వదిలేసి ఆ భక్తబృందంలో చేరిపోయాడు.
కీర్తనలు పాడుతూ కృష్ణుని పారవశ్యంలో మునిగితేలుతూ సూర్దాస్ యమునాతీరాన సంచరించేవాడట. అలా ఓ రోజు ఆయన బృందావనానికి చేరుకున్నాడు. కృష్ణుడు తన బాల్యాన్ని గడిపిన ఆ బృందావనంలో, సూర్దాస్ అలౌకకికమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ పారవశ్యంలో పాడిన భజనలు అనతికాలంలోనే ఆయనకు ప్రచారాన్ని తీసుకువచ్చాయి. సూర్దాస్ భక్తిని గమనించిన వల్లభాచార్యులవారు అతనిని తన శిష్యులలో ఒకరిగా చేర్చుకున్నారు. తన భక్తికి గురువు కూడా తోడవడంతో సూర్దాస్ కవితా ప్రతిభకు అంతులేకుండా పోయింది.
సూర్దాస్ భక్తి గురించి ఉత్తర భారతంలో చాలా గాథలు వినిపిస్తాయి. ఒకసారి సూర్దాస్ బావిలో పడిపోయాడట. అంతటి ఆపత్కాలంలోనూ ఆయన కృష్ణుని ధ్యానించడం వీడలేదట. సూర్దాసు భక్తికి మెచ్చిన కృష్ణపరమాత్ముడు స్వయంగా వచ్చి అతడిని రక్షించాడని చెబుతారు. ఆపై సూర్దాసుకి దృష్టి వచ్చే వరాన్ని ఒసగాడట. కానీ కృష్ణుని చూసిన కళ్లతో ఈ ప్రపంచాన్ని చూడలేనంటూ సూర్దాస్ తిరిగి తనకు అంధత్వం ప్రసాదించమన్నాడట.
సూర్దాస్ తన జీవితకాలంలో లక్షపాటలు రాశాడని చెబుతారు. అయితే వాటిలో ఎనిమిదివేలు మాత్రమే లభ్యమవుతున్నాయి. వీటిలో హిందీతో పాటుగా వ్రజభాష కూడా కనిపిస్తుంది. కృష్ణునితో అనుబంధం ఉన్న వ్రజ భూమిలో అనాదిగా వినిపించే భాషే ఈ వ్రజభాష! బాలకృష్ణుడు పలికిన భాషలోనే బాలకృష్ణుని లీలలను గుర్తు చేసే సూర్దాస్ భజనలు అద్భుతాలు. ‘నేను వెన్న తినలేదమ్మా! ఎవరో నా మొఖానికి వెన్న పూశారు’ అంటూ ఆ వెన్నదొంగని గుర్తుచేసే ‘మై నహీ మాఖన్ ఖాయో!’ వంటి భజనలు సూర్దాస్ రచనలలో అనేకం కనిపిస్తాయి. అలా కృష్ణభక్తిలో మునిగితేలుతూ, పదిమందికీ పంచుతూ వందేళ్లకు పైగా జీవించిన సూర్దాస్ మథుర సమీపంలో తన దేహాన్ని చాలించారని చెబుతారు.
కొన్ని కథల ప్రకారం సూర్దాస్ పుట్టుగుడ్డి కాదు. ఆయన మంచి అందగాడు, ధనవంతుడు. అలాంటి సూర్దాస్ ఒ వేశ్య మోహంలో పడిపోయాడు. ఆమె కోసం తన సర్వస్వాన్నీ త్యాగం చేసేందుకు సిద్ధపడ్డాడు. దివారాత్రులూ ఆ వేశ్య ధ్యానంలోనే గడిపేవాడు. తన తండ్రికి శ్రాద్ధకర్మలను నిర్వహించే సమయంలో కూడా ఎప్పుడెప్పుడు ఆ వేశ్యని కలుద్దామా అని అతని మనసు ఆరాటపడసాగింది. ఆ ఆరాటంతోనే క్రతువుని ముక్తసరిగా ముగించి తన ప్రేయసిని కలుసుకునేందుకు బయల్దేరాడు.
సూర్దాసు ప్రయసిని కలుసుకోవాలంటే ఒక నదిని దాటవలసి ఉంది. కానీ ఆ రాత్రి భీకరమైన వర్షం, హోరు గాలి. అలాంటి వాతావరణంలో, అంత చీకటివేళ నదిని దాటేందుకు పడవవాడు నిరాకరించాడు. దాంతో సూర్దాసు ఒక దుంగను పట్టుకుని ఈదుకుంటూ ఆవలి ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంతాచేసి అతను పట్టుకుని వచ్చిన వస్తువు దుంగ కాదు శవం అని తెలుస్తుంది. ఆ తర్వాత ప్రియురాలి మేడని ఎక్కేందుకు ఒక తాడుని పట్టుకుని పై అంతస్తుకి చేరుకుంటాడు. పైకి వెళ్లిన తర్వాత తాను పట్టుకున్నది తాడు కాదనీ పెద్ద పామునని తెలుస్తుంది.
అంత రాత్రివేళ, అలాంటి పరిస్థితులలో, అంత ప్రమాదానికి ఓర్చి తన దగ్గరకు వచ్చిన సూర్దాసుని చూసి వేశ్య ఆశ్చర్యపోతుంది. అతనిలోని మోమపు తీవ్రతను చూసి ఆమెకు కంపరమెత్తిపోతుంది. ‘ఇదే ఆర్తిని ఆ భగవంతుని పట్ల చూపిస్తే నీకు ఆయన దర్శనం లభించి తీరుతుంది కదా!’ అని ఛీదరించుకుంటుంది. ఆ మాటలతో సూర్దాస్ మనసు పరివర్తనం చెందుతుంది. అటుపై ఆయన భగవంతుని ధ్యానంలో మునిగిపోతాడు. అంతేకాదు! ఇకమీదట తన మనసు మరలే అవకాశం లేకుండా గుడ్డివాడైపోతాడు.
కథ ఏదైతేనేం! సూర్దాస్ అనే మహాభక్తుడు ఉన్నాడనీ, కృష్ణుని కీర్తిస్తూ అద్భుతమైన భజనలు రచించాడన్న విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. భక్తి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి హిందూమతానికి పునర్వైభవం రావడానికి సూర్దాస్ కీర్తనలు కూడా ఓ ప్రముఖ పాత్రని పోషించాయి.

దయ్యం భాష

ఒక నౌక సముద్రంలో సాగుతోంది. అది దూర దేశాలు వెళుతోంది. దాంట్లో వివిధ దేశాల ప్రజలు ఉన్నారు. విదేశీయానం పట్ల ఆసక్తి కలిగినవాళ్లు సముద్ర ప్రయాణాన్ని ఇష్టపడేవాళ్లు, వ్యాపారస్థులు ఎందరో ఉన్నారు. పెద్దలు,పిల్లలు, స్త్రీలు అందరితో నౌక సందడిగా ఉంది. వాళ్లలో ఒక సన్యాసి కూడా ఉన్నాడు. ఆయన ఎన్నో ధర్మాల్ని అధ్యయనం చేసినవాడు. మనుషుల గురించి బాగా తెలిసినవాడు. ప్రశాంత చిత్తుడు. నౌక అంతా కలకలం నిండి ఉన్నా నిర్లిప్తంగా తన లోకంలో తను వుండేవాడు. ఉదయం సముద్రాన్ని చూస్తూ, దాని గాంభీర్యానికి తలవంచుతూ, ఆకాశాన్ని కలియజూస్తూ, సాయం సంధ్యల్ని పరిశీలిస్తూ కాలం గడిపే వాడు. దూరదేశం నించీ వచ్చిన ఆహ్వానం మేరకు అక్కడఉపన్యసించడానికి ఆయన వెళుతున్నాడు. ఒక రోజు చీకటి పడబోతుంది. అది ఆయన ధ్యాన సమయం. ఒక మూల ఎవరూ లేని చోటుకు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నాడు. నౌకలో రకరకాల జనం ఉంటారు. నౌకకూడా లోకం లాంటిదే. ఒక కుర్రాళ్ల గుంపు కూడా ఆ నౌకలో ఉంది. వాళ్ళు ఎప్పట్నించో ఆ సన్యాసిని ఆటపట్టించాలని చూస్తున్నారు. ఒక మూలంగా వెళ్లి సన్యాసి కూచోవడం చూసారు. ఇది సమయమనుకున్నారు. దగ్గరగా వెళ్లారు. సన్యాసి కళ్లు మూసుకుని ఉండడం చూశారు. ఒక కుర్రవాడు పిల్లి కూతలు కూశాడు. సన్యాసి కళ్ళు తెరవలేదు. మరో కుర్రాడు కాగితపు ఉండల్ని సన్యాసిపై విసిరాడు. సన్యాసి పట్టించుకోలేదు. ఇద్దరు కుర్రాళ్లు గంతులువేస్తూ పాటలు పాడారు. సన్యాసి పట్టించుకోలేదు. దాంతో కుర్రాళ్ల అహం దెబ్బతింది. ఒక కుర్రాడు తన చెప్పుతీసి సన్యాసిపై విసిరాడు. సన్యాసి చలించలేదు. ప్రార్థనలో మునిగిపోయాడు.ఇదంతా పైనించీ దేవుడు చూస్తున్నాడు. దేవుడికి ఆగ్రహం కలిగింది. వెంటనే”నాయనా! నువ్వు ఒక్క మాట చెబితే ఈ నౌకను తలకిందు చేస్తా! వీళ్లందర్ని ముంచేస్తా!” అన్నాడు. ఆకాశం నుంచీ వినిపించిన ఆ మాటలతో అల్లరిమూక అదిరిపోయింది. అందరూ సన్యాసి పాదాలపై పడి క్షమాపణలు కోరారు. సన్యాసి వాళ్లను ఓదార్చి భయపడవద్దని చెప్పాడు. ఆకాశంలోకి చూసి ”దేవా! దయామయులైన మీరు దయ్యం భాషలో మాట్లాడడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. కరుణాసింధువయిన నువ్వు ఇంత కఠిన భాషలో మాట్లాడకూడదు కదా! మీరు దేన్నయినా తలకిందులు చెయ్యదలుచుకుంటే నౌకను కాదు. వీళ్ల బుద్దిని తలకిందులు చేయి. నౌకను తలకిందులు చేస్తే అంతా నాశనమవుతుంది. నువ్వు నాశనం చేసే వాడివి కాదు కదా! వెలుగు నింపే వాడివి కదా!” అన్నాడు. ఆకాశంనుంచీ బదులు వినిపించింది.”నాయనా! నువ్వు సత్యం చెప్పావు. నాస్వరంలో తేడాను గుర్తించావు. చాలా సంతోషం. ఎవరైతే దయ్యం భాషను గుర్తించగలరో నా నిజమైన స్వరాన్ని వాళ్లే గుర్తుపడతారు. నువ్వు నా స్వరాన్ని గుర్తు పట్టావు. నా తత్వాన్ని తెలుసుకున్నావు. నువ్వు చెప్పినట్లు నేను వీళ్ళ బుద్ధిని తలకిందులు చేస్తాను” అని దేవుడు ఆ అల్లరిమూకలో పరివర్తన తెచ్చాడు. ఆ కుర్రాళ్లు పశ్చాతాపంతో సన్యాసిని క్షమాపణలు కోరారు. సన్యాసి వాళ్ళని చిరునవ్వుతో ఆదరించాడు. మనసులు నిర్మలంగా మారాయి. నౌక నిశ్చలంగా సాగింది.

పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్


పార్వతీవల్లభనీలకంఠాష్ఠకమ్                                                                                                                                                                        
నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం
నమః కామభస్మం నమశ్శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /1/

సదాతీర్థసిద్ధం సదా భక్తరక్షం సదాశైవపూజ్యం సదా శుభ్ర భస్మం
సదా ధ్యానయుక్తం సదాజ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /2/

శ్శశానం శయనం మహానంతవాసం శరీరం గజానాం సదాచర్మవేష్టమ్
పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /3/

ఫణీ నాగకంఠే భుజంగాద్యనేకం గళేరుండమాలం మహావీరశూరం
కటిం వ్యాఘ్రచర్మం చితాభస్మ లేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /4/

శిరశ్శుద్ధ గంగా శివా వామభాగం బృహర్ధీర్ఘకేశం సయమాం త్రినేత్రం
ఫణీనాగకర్ణం సదా బాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /5/

కరే శూలధారం మహాకష్టనాశం సురేశం పరేశం మహేశం జనేశం
ధనేశస్తుతేశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /6/

ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధారానిర్థరం సంస్థితంహ్యాదిదేవం
అజా హేమకల్పద్రుమం కల్ప నవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /7/

మునీనాం వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజై స్సం, పఠంతం శివంవేదశాస్త్రం
అహో దీనవత్సం కృపాలం శివంహి భజే పార్వతీ వల్లభం నీలకంఠం /8/

సదా భావనాథ స్సదా సేవ్యమానం సదాభక్తి దేవం సదా పూజ్యమానం
సదాతీర్థం సదా సవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం /9/

శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం

ఓం శ్రీ గణేశాయ నమః
ఓం శ్రీమాత్రే నమః


సదాశివ సమారంభాం

శంకరాచార్య మధ్యమాం

అస్మదాచార్య పర్యంతాం

వందే గురు పరంపరాం


1. సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ
మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా I
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి: II

2. నజానామి శబ్దం నజానామి చార్థం
నజానామి పద్యం నజానామి గద్యం I
చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ II

3. మయూరాధిరూఢం మహావాక్యగూఢం
మనోహారిదేహం మహచ్చిత్తగేహం I
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం II

4. యదా సన్నిధానం గతామానవామే
భవామ్భోధిపారం గతాస్తేతదైవ I
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
త మీడే పవిత్రం పరాశక్తి పుత్రం II

5. యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః
తథైవాపదః సన్నిధౌ సేవతాంమే I
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం II

6. గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః
తదా పర్వతే రాజతే తేధిరూఢాః I
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు II

7. మహామ్భోధితీరే మహాపాపచోరే
మునీంద్రానుకూలే  సుగంధాఖ్యశైలే I
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం II

8. లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే
సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే I
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్ II
9. రణద్ధంసకే మంజులే త్యన్తశోణే
మనోహారి లావణ్య పీయూషపూర్ణే I
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే II

10. సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం
క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్ I
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ II

11. పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ
స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్ I
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్ II

12. విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్
నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్ I
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ II

13. సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః
సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్ I
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ II

14. స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్
కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని I
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి II

15. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్
దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు I
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః II

16. సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా
జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్ I
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః II

17. స్ఫురద్రత్న కేయూర హారాభిరామః
చల త్కుండల శ్రీలస ద్గండభాగః I
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః II

18. ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య
హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్ I
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ II

19. కుమారేశసూనో! గుహస్కందసేనా
పతే శక్తిపాణే మయూరాధిరూఢ I
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ II

20. ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే
కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే I
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ II

21. కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్
దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు I
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం II

22. ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా
ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం I
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా II

23. సహస్రాండ భోక్తాత్వయా శూరనామా
హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః I
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి II

24. అహం సర్వదా దుఃఖభారావసన్నో
భావాన్దీన బంధుస్త్వదన్యం న యాచే I
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ II

25. అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః
జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః I
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే II

26. దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః
ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్ I
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః II

27. మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం
అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః I
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే II

28. కలత్రం సుతాబంధువర్గః పశుర్వా
నరోవాథ నారీ గృహేయే మదీయాః I
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార II

29. మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః
తథా వ్యాధయో బాధకా యే మదంగే I
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల II

30. జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం
సహేతే న కిం దేవసేనాధినాథ I
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ II

31. నమః కేకినే శక్తయే చాపి తుభ్యం
నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః I
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు II

32. జయానందభూమన్ జయాపారధామన్
జయామోఘకీర్తే జయానందమూర్తే I
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో II

33. భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః
పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య I
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః II

ఇతి శ్రీ శంకర భగవత్పాద విరచిత శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సంపూర్ణమ్.